మోడీ సమావేశం : ఎస్పీ బాలు అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఉత్తరాది కళాకారులకే ప్రాధాన్యత ఇచ్చి, దక్షిణాది వారిని చిన్నచూపు చూశారని.. అవమానించారని బాలు తన ఫేస్బుక్లో రాశారు. గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన ఛేంజ్ విత్ఇన్ కార్యక్రమాన్ని బాలు కూడా అతిథిగా హాజరయ్యారు. అక్కడ తనకు చేదు అనుభవాలు ఎదురైనట్టు బాలు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా వివరించారు.
ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో అక్టోబర్ 29న ఛేంజ్ విత్ఇన్ కార్యక్రమం జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దల్ని మోదీ ఆహ్వానించారు. సమాజహితం కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. తమను ట్రీట్ చేసిన విధానంపై ఎస్పీ బాలసుబ్రమణ్యం తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందే.. గేటు వద్దే తమ సెల్ఫోన్లను లాగేసుకున్నారని చెప్పారాయన. సెక్యూరిటీ పర్పస్లో అలా చేశారని సహకరించామని.. కానీ.. బాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లు మాత్రం తీసుకోలేదని అన్నారు. వాళ్ల చేతుల్లో సెల్ఫోన్లు కనిపించాయని.. వాటితోనే వాళ్లు సెల్ఫీలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఇదే పద్ధతని వాపోయారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ విషయం తనను తలవంపులకు గురిచేసిందని బాలు ఆవేదన. ఇదే విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com