తహసీల్దార్ విజయారెడ్డి కేసులో నిందితుడు సురేష్ మృతి

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసులో నిందితుడు సురేష్ మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ చనిపోయాడు. 65 శాతం కాలిన గాయాలతో ఉన్న అతని పరిస్థితి విషమించడంతో ప్రాణాలు వదిలాడు.
ఛాతి, పొట్ట, ముఖం, చేతులకు తీవ్ర గాయాలు అవడం.. శరీరంలో నీరు లేకపోవడంతో బర్న్సెప్టిక్ ఇన్పెక్షన్ ప్రమాదం ఉందని బుధవారమే వైద్యులు చెప్పారు. గురువారం నాడు పరిస్థితి విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలాడు. తహసీల్దార్ను ఎందుకు హత్య చేశాడనే దానిపై ఇప్పటికే మేజిస్ట్రేట్ సమక్షంలో అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. బుధవారం మరోసారి అదనపు సమాచారం సేకరించేందుకు సిట్ టీమ్ ఉస్మానియాకు వెళ్లింది. ఐతే.. సురేష్ మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చేశారు. ఇప్పుడు అతను చనిపోడంతో కేసులో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనేది తేల్చడం పోలీసులకు కొంచెం కష్టంగా మారనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com