భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు చేసిన ప్రభుత్వం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మొలుక్క సముద్ర తీరంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. టెర్నేట్ పట్టణానికి 139 కిలోమీటర్ల దూరంలో, 45 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు ప్రకటించారు.
భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో సునామీ హెచ్చరికలను జారీ చేసింది ఇండోనేషియా ప్రభుత్వం. తీర ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది.
అటు నికోబార్ దీవుల్లోనూ శుక్రవారం భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. నికోబార్ దీవుల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని నికోబార్ అధికారులు చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com