20 మంది మహిళల్ని ముగ్గులోకి దించిన మాయగాడు
అతనో మాయగాడు. మహిళల్ని అత్యంత చాకచక్యంగా ముగ్గులోకి దించడం అతడి స్పెషాలిటీ. తీరా ఓసారి పరిచయం అయ్యాక.. ఆ తర్వాత చుక్కలు చూపిస్తాడు. పైగా అతడికి ఓ ముఠా కూడా ఉంది.
విశాఖపట్నం తిక్కవాని పాలెంకు చెందిన వంకా కుమార్ అలియాస్ అజిత్ ఉచ్చులోపడి ఇప్పటి వరకు 20 మంది మహిళలు మోసపోయినట్టు సమాచారం. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో హౌస్ కీపింగ్లో పనిచేసే ఈ యువకుడు డాక్టర్ గెటప్లో చాలా మందిని బురిడీ కొట్టించాడు. తాను గైనకాలజిస్టునని పరిచయం చేసుకునేవాడు. ఫేస్బుక్ ద్వారా అలా చాలా మందితో ఫ్రెండ్షిప్ చేసేవాడు. లావుతగ్గడానికి ఇతర రకాల ట్రీట్మెంట్లు చేస్తానని నమ్మించేవాడు.
పరిచయమైన మహిళలకు చిన్నచిన్న అవసరాలకు సహాయపడుతూ వారికి మరింత దగ్గరయ్యేవాడు. విశాఖలో నిర్మానుష్యంగా ఉండే కంబాలకొండ, తొట్లకొండ వంటి ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ తన ముఠా సభ్యులను ముందుగానే సెట్ చేసి మహిళలను బెదిరించి వారి ఫోటోలు తీసేవాడు. అలా వారి వద్ద ఉండే బంగారం, నగదు చోరీ చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు కుమార్.
తనకు డబ్బు అవసరమైనప్పుడల్లా ఫోటోలను బయటపెడతానని మహిళల్ని బెదిరించేవాడు. పరువు పోతుందని భయపడ్డవాళ్లు డబ్బులు సమర్పించుకునేవారు. ఇతడి టార్చర్ తట్టుకోలేక ఓ బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమార్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇతడితో కలిసి నేరాలకు సహకరించిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com