తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్తో మరో రైతు..
తెలంగాణలోని తహసీల్దార్ ఆఫీసుల్లో తిరుగుబాట్లు, నిరసన ఘటనలు సంచలనం రేపుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయానికి ఓ రైతు పెట్రోల్తో రావడం కలకలం సృష్టించింది. తన పొలం పట్టా వివాదాన్ని పరిష్కరించకుండా పదేపదే నిర్లక్ష్యం చేస్తున్నారన్న కోపంతో లంబడిపల్లికి చెందిన ఓ రైతు.. కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. అది అక్కడే ఉన్న ఉద్యోగులపై కూడా పడింది. ఈ ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోయారు. వెంటనే రైతును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అన్నదమ్ముల మధ్య భూవివాదం పరిష్కారం కోసం ఆ రైతు కొన్నాళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. చివరికి విసుగుచెందే ఇలా చేసినట్టు చెప్తున్నారు.
అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసు ఇప్పటికే సంచలనం అయ్యింది. పలు జిల్లాల్లోనూ రైతులు పెట్రోల్ బాటిళ్లతోనూ, కర్రలతోనూ హల్చల్ చేశారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఆఫీస్లో రైతు పెట్రోల్ చల్లడం సంచలనంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com