మెగాస్టార్ ఇంట్లో మెరిసిన తారలు
ఎనభైల నాటి తారలంతా ఒక చోట చేరారు. ఆడిపాడి సందడి చేశారు. ఆ రోజుల్లోని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇందుకు హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఆయన నివాసం తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ నటులతో సందడిగా మారింది. 80 నాటి తారలంతా ఒక చోట చేరి క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటారు. తాజాగా 10 వార్షికోత్సవాన్ని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.
గతంలో వివిధ ప్రాంతాల్లో క్లాస్ ఆఫ్ ఎయిటీస్ వార్షికోత్సవం జరుపుకోగా.. ఈసారి పదో వార్షికోత్సవం కావడంతో స్పెషల్గా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తన తోటి సహనటులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. అంతే కాదు ఈ కార్యక్రమానికి చిరు హోస్టింగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో ఈ గెట్ టుగెదర్ నిర్వహించారు. ఈ రీయూనియన్ మీట్లో 1980-1990లోని అగ్ర తారలంతా పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా మలయాళం, కన్నడం నుంచి మొత్తం 40 మంది తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.
పార్టీలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్లాల్, శరత్ కుమార్, రాధిక, ఖుష్బూ, సుహాసిని, జయసుధ, సుమలత రాధ, రేవతి, అమల హాజరయ్యారు. వీరితో పాటు ప్రభు, రెహమాన్, భానుచందర్, సుమన్, శోభన, నదియా, సరిత, జగపతిబాబు, భాగ్యరాజ్, రమేశ్ అరవింద్, జాకీ ష్రాఫ్తో పాటు పలువురు నటులు పాల్గొన్నారు. ప్రతీ ఏడాది జరిగే పార్టీకి ఓ డ్రెస్కోడ్ ఉంటుంది. ఈ ఏడాది డ్రెస్ కోడ్ బ్లాక్, గోల్డ్ కలర్లో మెరిశారు. అందరూ అదే రంగు దుస్తుల్లో హాజరయ్యారు. అంత్యాక్షరీ, మ్యూజికల్ చైర్స్ వంటి సరదా ఆటలతో సందడి చేశారు అలనాటి తారలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com