ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ప్రగతి భవన్లో సుమారు రెండు గంటల పాటు 97 డిపోల నుంచి వచ్చిన ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన సీఎం కేసీఆర్ పలు హామీలు కురిపించారు. కార్మికులు కోరిన పలు డిమాండ్లకు వెంటనే పరిష్కారం చూపించారు. సెప్టెంబర్ జీతం రేపు చెల్లించాలని అధికారులకు ఇప్పటికే కేసీఆర్ సూచించారు. అలాగే 52 రోజుల సమ్మె కాలం జీతాన్ని ఏకకాలంలో చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒక్క రూటులోనూ ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికులను ఎవరినీ తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు లక్ష రూపాయల ఎక్స్గ్రేషియో చెల్లిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు టికెట్టు తీసుకోకపోతే ఇంతవరకు కండక్టర్పై చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై ఎవరైనా ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే.. కండక్టర్పై చర్యలు తీసుకోకుండా నేరుగా ప్రయాణికుడికే ఫైన్ వేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఏడాది రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ కోసం రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులంతా కష్టపడి పని చేసి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు లాభం వచ్చేలా కృషి చేయాలని కోరారు. కార్మికులంతా కష్టపడి ఆర్టీసీని లాభాల్లోకి తెస్తే సింగరేణి మాదిరిగా బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. గత కొతకాలంగా మహిళలు డిమాండ్ చేసినట్టు ప్రతి సమస్యను పరిష్కరిస్తామని కేసీఆర్ భోరాసా ఇచ్చారు. ఆర్టీసీ డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతుల ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com