భార్యను హత్య చేసిన బ్యాంక్ మేనేజర్.. నేరం పాము ఖాతాలో..
భార్యను హత్య చేసి తెలివిగా తప్పించుకోవాలని పక్కా స్కెచ్ వేశాడు ఓ మాజీ బ్యాంక్ మేనేజర్. భార్య శివానీని హత్య చేసి.. ఆమె చేతిలో మరణించిన పాము కోరలను ఉంచి పాముకాటుకు గురైందని కలరింగ్ ఇచ్చాడు. చివరకు పాపం పండి కటకటాలపాలయ్యాడు. మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఇండోర్లో నివాసముంటున్న మాజీ బ్యాంక్ మేనేజర్ అమితేష్ పటేరియా డిసెంబర్ 1న భార్యతో గొడపడి ఆమెను హత్య చేశాడు. తరువాత చనిపోయిన పాము కోరలను తన భార్య చేతిలో ఉంచి పాముకాటుకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఊపిరి ఆడకపోవటంతోనే శివానీ మరణించినట్టు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో పోలీసులకు ఆమె భర్త మీద అనుమానం వచ్చింది. తమదైన స్టైల్ లో విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పటేరియా భార్యను హత్య చేసేందుకు ముందే స్కెచ్ వేశాడు.. 11 రోజుల ముందే రాజస్తాన్లోని అల్వార్ నుంచి నల్ల తాచుపామును రూ.5000లకు కొనుగోలు చేశాడు. తరువాత ఆ పామును కప్బోర్డ్లో దాచినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం సాక్ష్యాలను కనుమరుగుచేసేందుకు పటేరియా పామును కూడా చంపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భర్త పటేరియాపై వివిధ సెక్షన్లతో పాటు పామును చంపినందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com