ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నావ్ అత్యాచార బాధితురాలు తుదిశ్వాస విడిచింది. ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ పాప చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు దిశ కేసు సంచలనం రేపుతుండగానే.. ఉన్నావో ఘటన జరగడం కలకలం సృష్టించింది.
యూపీలోని ఉన్నావ్కు చెందిన ఓ యువతి.. తనపై అత్యాచారం జరిపారంటూ మార్చిలో ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం రాయ్బరేలీలోని కోర్టుకు వెళ్లేందుకు సదరు బాధితురాలు బయల్దేరింది. అయితే కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఆమెను ప్రధాన నిందితులు దారిలో అటకాయించి ఆమెపై హత్యాయత్నం చేశారు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శరీరం 90శాతంకి పైగా కాలిపోవడంతో.. మెరుగైన చికిత్స కోసం యూపీ నుంచి ఎయిర్ ఆంబులెన్స్లో ఢిల్లీకి తరలించారు. రెండు రోజులపాటు చికిత్స పొందిన తర్వాత బాధితురాలు తుది శ్వాస విడిచింది. ఈ కేసులో ఇప్పటికే అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com