దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్లో మరో ట్విస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్లో మరో ట్విస్ట్. సుప్రీంలో ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. నిందితుల మృతదేహాలను ఏసీ అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలోనే నిందితుల మృతదేహాలను భద్రపర్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ లాయర్ ప్రకాష్రెడ్డిని మధ్యవర్తిగా సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాతే.. గురువారం రోజు విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, ఈ లోపు ఎఫ్ఐఆర్ కాఫీలు, డాక్యుమెంట్లు, పోస్టుమార్టం వీడియోకు సంబంధించిన సీడీలు సమర్పించాలని ఆదేశించింది.
ప్రస్తుతం కోర్టు తీర్పుతో నిందితుల మృతదేహాల అంత్యక్రియలకు మరోసారి బ్రేక్ పడినట్టు అయ్యింది. శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరగగా.. అదే రోజు సాయంత్రానికి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. అయితే, ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, హైకోర్టు ఆదేశాలతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. దీంతో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన ప్రాంతంలో, ఆ తర్వాత మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో మృతదేహాలను భద్రపరిచారు. హైకోర్టు విచారణ తర్వాత సోమవారం మృతదేహాలను బంధువులకు ఇస్తారని అంతా భావిస్తున్న సమయంలో.. హైకోర్టు మరోసారి ఈ కేసు వాయిదా వేసింది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. దీంతో మరోసారి అంత్యక్రియలకు బ్రేక్లు పడగా.. మహబూబ్నగర్ నుంచి గాంధీ ఆస్పత్రికి నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com