మొన్నే పెళ్లైంది.. అప్పుడే విడిపోతోంది.. హీరోయిన్
ఎన్నో కలలు, మరెన్నో కోరికలతో కొత్త బంగారు లోకంలోకి అడుగు పెట్టింది. అయితే తను కలలు కన్న అందమైన లోకం అక్కడ కనిపించలేదు ఆమెకు. అందుకే విడిపోతోంది. ఇకపై నీ జీవితం నీది.. నా జీవితం నాది అంటూ భర్తకు బైబై చెప్పింది. విడాకులకు అప్లై చేసింది. బాయ్ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఏం తెలియలేదు.. భర్తగా వచ్చాకే ఆయనేంటో పూర్తిగా తెలుసుకున్నాను. కొన్ని నెలలుగా ఇద్దరి మద్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీంతో కలిసి ఉండడం కష్టమనుకున్నాం. అందుకే విడిపోతున్నాం అంటూ నటి శ్వేతా బసు ప్రసాద్ ట్విట్టర్ వేదికగా తన విడాకుల గురించి వివరించింది.
తాను తన భర్త రోహిత్ మిట్టల్తో విడిపోతున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు వరకు మా ప్రయాణం సంతోషంగా సాగింది. కానీ ఇప్పుడు అపార్థాలు చోటు చేసుకున్నాయి. అయినా ఒక పుస్తకం చదువుదామని కొంటాం..
దాన్ని చివరి పేజీ వరకు చదవాలని రూలేం లేదు కదా.. ఇష్టమైతే చదువుతాం లేకపోతే లేదు.. చదవనంత మాత్రాన అదేం చెడ్డ పుస్తకం కాదు. కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. నాకు స్ఫూర్తిగా ఉంటూ.. ఎన్నో జ్ఞాపకాలు అందించిన రోహిత్కు థ్యాంక్యూ అంటూ పోస్ట్ పెట్టారు.
పెళ్లై ఏడాదికే విడిపోవడం ఏంటని విమర్శించేవారికి నేనేమీ చెప్పలేను. ఇది నా వ్యక్తిగత విషయం అని శ్వేతా వివరించింది. కాగా శ్వేత తెలుగులో కొత్త బంగారు లోకం, రైడ్, కాస్కో సినిమాల్లో నటించింది. వ్యాపార వేత్త రోహిత్ను 2018 డిసెంబర్ 13న శ్వేతాబసు వివాహం చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేత పలు సినిమాలు, సీరియల్స్లో నటించారు. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
— Shweta Basu Prasad (@shweta_official) December 9, 2019
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com