కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్
తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు తీసుకోవడం తప్ప రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్న గులాబీ దళపతి..త్వరలోనే మరోసారి హస్తిన వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
కొన్ని రోజులుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం.. అటు కేంద్రం మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఆర్దిక మాంధ్యం అసలే లేదని కేంద్ర మంత్రులు అంటుంటే.. అన్ని అబద్దాలే అంటూ టిఆర్ఎస్ సర్కారు ఆరోపిస్తుంది. మాంద్యమే లేకుంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులెందుకు ఇవ్వడం లేదంటూ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో 40వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్రం తీసుకుంటూ.. తెలంగాణకు సరిగా నిధులివ్వడం లేదంటూ టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 19,719 కోట్ల రూపాయలు ఇస్తామని బడ్జెట్ లో కేంద్రం ప్రకటన చేసిందని.. గడిచిన ఎనమిది నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా కేవలం 10వేల 304 కోట్ల రూపాయలు మాత్రమేనని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రతి ఏటా కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గుతున్నాయని అంటున్నారు. పార్లమెంటులో మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని,పరిస్థితి ఇట్లనే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటాయంటుంది తెలంగాణ సర్కారు.
ఇదే అంశంపై ఆర్దిక మంత్రి నిర్మాలా సీతారామన్ కు ముఖ్యమంత్రి కేసిఆర్ లేఖ కూడా రాశారు. వాస్తవాలను కప్పి పుచ్చి పార్లమెంట్ సాక్షిగా ఆర్దిక మాంధ్యం లేదని ఎలా చెబుతారని లేఖలో ప్రశ్నించారు. నిధుల విషయంలో కేంద్ర పెద్దలను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం లేదని.. పైగా రాష్ట్రానికి ఇచ్చే నిధుల శాతం తగ్గుతాయని సమాధానాలు వస్తున్నాయని సీఎం కేసిఆర్ లేఖలో పేర్కొన్నారు.అందుకే మోదీ తో తేల్చుకునేందుకు 11న కేబినెట్ తర్వాత డిల్లీ వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. 12 లేదా 13 తేదీల్లో మోదీ అపాయింట్మెంట్ దొరకుంతుందని ఆశాభావంతో ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com