ఫాస్టాగ్‌ టోల్‌ప్లాజాల విధానం వలన ఇబ్బందులు

ఫాస్టాగ్‌ టోల్‌ప్లాజాల విధానం వలన ఇబ్బందులు

fastag

ఫాస్టాగ్‌..! టోల్‌ప్లాజాల వద్ద టైమ్‌ వేస్ట్ కాకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన కొత్త విధానం. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై అమల్లోకి వచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. ఫాస్టాగ్‌ విధానంపై వాహనదారులు ఇంకా మొగ్గు చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌కు అధిక లైన్లు, నగదు చెల్లింపునకు తక్కువ లైన్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్‌- విజయవాడ, హైద్రాబాద్‌- వరంగల్‌ నేషనల్‌ హైవేల మీదున్న టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ విధానం అమలవుతోంది. పంతంగి టోల్‌ ప్లాజాలో 16 ఎంట్రీ- ఎగ్జిట్‌ లైన్లు ఉండగా.. వీటిలో 10లైన్లను ఫాస్టాగ్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. మిగిలిన ఆరు లైన్లలో నాన్‌- ఫాస్టాగ్‌ వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయి ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. కేతేపల్లి మండలం కోర్ల పహాడ్‌ టోల్‌ప్లాజాలోనూ ఇదే పరిస్థితి. హైదరాబాద్‌- వరంగల్‌ హైవే మీదున్న గూడూరు టోల్‌ ప్లాజా దగ్గర కూడా వాహనాలు బారులు తీరాయి.

ఫాస్టాగ్‌ సిస్టమ్‌ విధానంపై అవగాహన కల్పించడంలో జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ లోపం కొట్టొచ్చినట్టు కనబడింది. కొత్త పద్ధతిపై అవేర్‌నెస్‌ లేక చాలా మంది వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 40శాతం వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ తీసుకున్నారు..

ఈ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒకే ఒక్క లైన్‌ను ఫాస్టాగ్‌ రహిత వాహనాలకు కేటాయించాలి. అయితే.. ఇప్పుడు ఫాస్టాగ్‌ లైన్లలో 25 శాతం వరుసలను హైబ్రీడ్‌ లైన్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఫాస్టాగ్‌ లైన్‌లోకి వచ్చే ఇతర వాహనాలకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story