సమత నిందితులకు న్యాయవాదుల సహాయనిరాకరణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు నాలుగు రోజుల ముందు...కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అలాంటి ఘోరమే జరిగింది. సమత అనే మహిళపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు ముగ్గురు కిరాతకులు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. సోమవారం ముగ్గురు నిందితులు A1-షేక్బాబు, A-2షేక్ షాబుద్దీన్, A3-షేక్ ముగ్దుమ్లను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హజరుపరిచారు. న్యాయవాదిని నియమించుకోవాలని నిందితులకు సూచించారు న్యాయమూర్తి. ఇందుకు ఎవరూ ముందుకురాక పోవడంతో 3 రోజుల సమయం కావాలని కోరారు. మంగళవారంలోగా లాయర్ను నియమించుకోకపోతే... ప్రభుత్వమే అడ్వకేట్ను కేటాయిస్తుందని జడ్జి ప్రియదర్శిని స్పష్టం చేశారు..
ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కుమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి 140 పేజీల రిపోర్టు సమర్పించారు. 44 మంది సాక్ష్యులను విచారించారు.. సాక్షుల వాంగ్మూలం, FSL నివేదిక సహా, ఇతరత్రా ఆధారాలు కోర్టుకు సమర్పించారు. త్వరగా విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
నవంబర్ 27వ తేదీన ఆసీఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలో సమతపై నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసు సత్వర విచారణకు ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ కోర్టును ఫాస్ట్ట్రాక్ కోర్టుగా మార్చారు. నిందితులపై 302, 376-డి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com