మాస్టారు మందలించినందుకు స్టూడెంట్..

చదవడం లేదని మందలించినందుకు ఓ 10 వతరగతి విద్యార్ధి ప్రాణం తీసుకున్నాడు. కోహీర్ మండలం పైడిగుమ్మల గ్రామానికి చెందిన రత్నం అనే విద్యార్ధి కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. అయితే.. ఆ విద్యార్ధి సరిగా చదవకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ అతన్ని మందలించాడు. విద్యార్ధి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ కూడ ఇచ్చాడు.
అయితే.. తనను మందలించారని తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్ధి రత్నం..చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు,బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కుమారుణ్ని కొట్టి చంపేశారని ఆరోపించారు. తాము రాకముందే తమ కుమారుడి మృత దేహాన్ని ఆసుపత్రికి ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com