దిశ ఘటన మరువకముందే.. హైదరాబాద్‌లో మరో గ్యాంగ్‌ రేప్‌

దిశ ఘటన మరువకముందే.. హైదరాబాద్‌లో మరో గ్యాంగ్‌ రేప్‌

rape

ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దిశ ఘటన మరువకముందే.. హైదరాబాద్‌ మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య ఉదాంతానికి సరిగ్గా ఒకరోజు ముందు.. అంటే నవబంబర్‌ 26న పాతబస్తీలోని ఒక మానసిక వికలాంగురాలిపై ముగ్గురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. నిందితుల్లో ఇద్దరు ఆటోడ్రైవర్లు కాగా.. మరో వ్యక్తి బ్యాండ్ మ్యాన్‌గా తెలుస్తోంది. మతిస్థిమితం లేని యువతి కావడంతో.. బాధితురాలు సరిగా వివరాలు చెప్పలేకపోవడంతో ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల సహకారంతో ఆధారాలు సేకరించిన కుల్సుంపురా పోలీసులు.. ఎట్టకేలకు మానవ మృగాలైన ఖలీమ్, అజీజ్, నజీర్‌లను అరెస్ట్‌ చేశారు.

కుల్సుంపురా పరిధిలో 19 ఏళ్ల యువతి.. తన తల్లి, సోదరులతో కలిసి ఉంటోంది. ఆమెకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తరచూ ఇంటినుంచి బయటకు వెళ్తుంటూంది. అలా వెళ్లిన ప్రతిసారి సోదరులు వెతికి తీసుకొస్తుండేవారు. గత నెల 26న సాయంత్రం పురానాపూల్ చౌరస్తా సమీపంలో ఆ యువతి ఒంటరిగా నిలబడి ఉండగా... ఖలీమ్, అతడి బంధువైన అబ్దుల్ అజీజ్ అనే ఆటో డ్రైవర్లు ఆమెపై కన్నేశారు. ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి ఆటోలో ఎక్కించుకుని మూసీనది ఒడ్డుకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జుమ్మెరాత్ బజార్ చౌరస్తాలో దింపి.. అక్కడే ఉన్న నజీర్ అనే బ్యాండ్ మ్యాన్‌కు అప్పగించి.. ఆమె చిరునామా కనుక్కుని ఇంటికి చేర్చమని చెప్పి వెళ్లిపోయారు. ఆ యువతిని చూడగానే నజీర్‌కు కూడా దుర్బుద్ధి పుట్టింది. అతడు కూడా మూసీ ఒడ్డుకే తీసుకెళ్లి బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ రోజు అర్ధరాత్రి తీసుకొచ్చి పురానాపూల్ చౌరస్తాలో వదిలేసి వెళ్లిపోయాడు ఆ దుర్మార్గుడు.

తమ సోదరి కనిపించడం లేదంటూ అప్పటికే ఆమె సోదరులు కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గాలిస్తుండగా పురానాపూల్ వద్ద ఆమె కనిపించడంతో ఇంటికి తీసుకెళ్లారు. తనపై ఎవరో ఏదో చేశారంటూ సైగలతో వివరించింది. ఏం జరిగిందో బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోవడంతో కుల్సుంపురా పోలీసులు మరుసటిరోజు ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. మానసిక నిపుణులు, వైద్యులతో సుమారు ఐదు గంటలపాటు మాట్లాడించి చికిత్స అందించారు. కోలుకున్న బాధితురాలు ఆరోజు జరిగిందేమిటో వైద్యులు, మానసిక నిపుణులకు వివరించడంతో పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కానీ వారికి ఒక్క ఆధారం కూడా లభించలేదు. దీంతో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించిన పోలీసులు.. బాధితురాలు చివరగా కనిపించిన బార్ నుంచి దర్యాప్తు చేపట్టారు. బ్యాండ్ మ్యాన్ నజీర్ ఆమెను అక్కడ వదిలేసినట్టు గుర్తించారు. మరో సీసీ కెమెరాలను పరిశీలించగా బాధితురాలిని ఆటోలో తీసుకువెళ్తున్న ఖలీమ్, అబ్దుల్ అజీజ్‌లు ఫుటేజీల్లో దొరికారు. ఆటో నంబరు ఆధారంగా దర్యాప్తు చేయగా.. ఈ మానవమృగాళ్లు పోలీసులకు చిక్కారు.

Tags

Read MoreRead Less
Next Story