టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు
టాలీవుడ్ నటుల ఇళ్లపై జీఎస్టీ దాడులు చేసింది. ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ, టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. వీళ్లు ముగ్గురూ సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీని ఎగ్గొట్టారన్న అనుమానాలు రావడంతో.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఏక కాలంలో పలువురు సినీనటులు, యాంకర్ల ఇళ్లలో డీజీజీఐ దాడులు టాలీవుడ్లో కలకలం రేపాయి.
జూబ్లీహిల్స్లోని లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు జరిగాయి. వెంటనే విషయం తెలుసుకున్న ఆమె సినిమా షూటింగ్ను రద్దు చేసుకుని ఇంటికి వెళ్లారు. మణికొండలోని యాంకర్ సుమ కనకాల, బంజారాహిల్స్లోని అనుసూయ ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. దాడులు చేసిన కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ పెట్టుబడులు పెట్టారని.. ఆ సంస్థల నిర్వాహకులు సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ ఎగ్గొట్టారనే అనుమానాలు వ్యక్తం చేసిన అధికారులు.. వారి ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా సినీ నటులు సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఐతే.. వీళ్లు పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఆ సంస్థలు సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించలేదన్న కారణంతోనే అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.
సుమ, అనసూయ, లావణ్య త్రిపాఠి ఇళ్లతోపాటు హైదరాబాద్లోని మొత్తం 23 చోట్ల ఒకేసారి సోదాలు చేశారు. చిట్ఫండ్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఫిట్నెస్ సెంటర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలతో పాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల్లోనూ ఈ టీమ్లు దాడులు చేశాయి. కోట్లలో సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీని ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఈ సంస్థ నిర్వాహకులపై ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com