రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు? : చంద్రబాబు
రాజధాని రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే అమరావతి పరిరక్షణ సమితి, రైతులతో కలిసి ఢిల్లీ వెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి మెమోరాండం ఇస్తామని తెలిపారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఇది కేవలం ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడం కాదని.. దేశ అభివృద్ధిని కూడా అడ్డుకున్నట్లేనని ఆరోపించారు.
3 రాజధానులంటూ రాష్ట్రంలో ప్రజల మధ్య సీఎం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు? దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని అన్నారు. ఇప్పుడు రాయలసీమ ప్రజలకు మాకు అన్యాయం జరుగుతోందని నిలదీస్తున్నారని.. వారికి సీఎం ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు చంద్రబాబు.
పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. చట్టం కొందరికి చుట్టం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలని హెచ్చరించారు. జగన్ కోసం సపరేట్గా చట్టం లేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు చంద్రబాబు.
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపైనా చంద్రబాబు స్పందించారు. హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో గత 7నెలల్లో మీరు చేసిన అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీలో రాజధాని అమరావతిపై గతంలో జగన్ చేసిన ప్రసంగం వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com