కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని
ఏపీ రాజధానిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. GNరావు కమిటీ నివేదకను పరిశీలించిన మంత్రివర్గం.. మరింత సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్టు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఆ కమిటీ నివేదిక జనవరి 3 న రావచ్చని తెలుస్తోంది. ఈ రెండు కమిటీల నివేదికల్ని అధ్యయనం చేయడం కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.ఇందులో మంత్రులు, న్యాయనిపుణులు సభ్యులుగా ఉంటారు..ఈ హైపవర్ కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాజధాని గ్రామల ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు..అందరికీ సానుకూలమైన నిర్ణయాన్నే ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేయలేదని...ఉండొచ్చని మాత్రమే చెప్పారని మంత్రి పేర్నినాని తెలిపారు.
CRDA అవినీతి, భూకుంభకోణాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ.. మంత్రివర్గానికి నివేదిక సమర్పించింది. ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరెవరు భూములు కొన్నారో ఇప్పటికే గుర్తించామని చెప్పారు మంత్రి పేర్నినాని. 2014 డిసెంబర్31కు ముందు జరిగిన భూములు కొనుగోళ్లపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. లోకాయుక్త, సీబీఐ, సీఐడీల్లో ఏదో ఓ సంస్థతో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత ఏ సంస్థకు ఇవ్వాలన్నదీ నిర్ణయిస్తామన్నారు. టీడీపీ హయాంలోశివరామకృష్ణన్ కమిటీ నివేదకను కాదని.. నారాయణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భూసేకరణ చేశారని మంత్రి పేర్నినాని ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com