ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ సూచన

ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ సూచన

cm-ys-jagan

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు.. అమ్మ ఒడితోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌తోపాటు ఆయా శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లలోనే నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. అదే రోజున తల్లిదండ్రులతో ఏర్పడ్డ విద్యా కమిటీలను పిలిపించి ఘనంగా అమ్మ ఒడిని నిర్వహించాలని చెప్పారు.

ప్రజలు ప్రభుత్వం నుంచి నాణ్యమైన విద్యను ఆశిస్తున్నారని... పాఠ్యప్రణాళికలో నాణ్యతను కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల్లో ఫీజులు షాక్‌ కొట్టే రీతిలో ఉన్నాయని... ఫీజులు వెంటనే తగ్గించాలని అధికారులకు సూచించారు.. అలాగే విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని.. ప్రభుత్వ స్కూళ్లు తెలుగు మీడియంలో ఉన్నందువల్ల పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం చదువులు కోసం విపరీతంగా ఖర్చుపెడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని ప్రయత్నాలు చేస్తున్నామని... దీన్ని విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంగ్లీషు మీడియంను పేదవాళ్ల దగ్గరకు తీసుకెళ్తేనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ సందర్భంగా విపక్షాల తీరుపై ముఖ్యమంత్రి జగన్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారని... మద్యం దుకాణాలు, బార్లు తగ్గిస్తుంటే దానిపైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా సమావేశంలో చర్చ జరిగింది.. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేదల పిల్లలు మంచి కాలేజీల్లో చదువుకోవాలని.. ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వాల్సిన డబ్బులను సకాలంలో ఇస్తామని జగన్‌ చెప్పారు. ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెద్దపెద్ద విద్యాసంస్థల్లో కూడా పేదలకు అవకాశాలు లభించాలని.. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై దృష్టిపెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలను ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోవాలని, టీచర్లను విద్యాబోధనకే వినియోగించుకోవాలని సీఎం సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story