డ్రగ్స్ మత్తులో కారుతో ఎస్సైనే ఢీకొట్టిన యువకుడు
డ్రగ్స్ మత్తులో కారుతో ఎస్సైనే గుద్దేశాడో యువకుడు. బుధవారం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో సమీపంలో జరిగిందీ ఘటన. ఈ ప్రాంతంలో రిసార్ట్లు ఎక్కువగా ఉండడం, పార్టీల కోసం హైదరాబాద్ నుంచి యూత్ ఎక్కువ మంది వస్తున్నందున.. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు. ఫుల్గా డ్రగ్స్ తీసుకున్న ఇద్దరు యువకులు ఈ తనిఖీల్ని దగ్గరకు వచ్చాక గమనించారు. దొరికిపోకుండా ఉండేందుకు ఒక్కసారిగా వాహనం వేగం పెంచి దూకించే ప్రయత్నం చేశారు. వీళ్లను అడ్డుకోబోయిన ఎస్సైని ఢీకొట్టి ముందుకెళ్లారు. అప్రమత్తమైన మిగతా పోలీసులు వెంటనే ఈ కారును ఆపేశారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో ఎస్సై శ్రీకృష్ణ కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యువకులపై కేసు నమోదు చేశారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, ఇంకా పార్టీలో ఎవరెవరు మాదకద్రవ్యాలు తీసుకున్నారు అనే దానిపై ఆరాతీస్తున్నారు. డిసెంబర్ థర్టీఫస్ట్ పార్టీలకి భారీ స్థాయిలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేసిన కొన్ని ముఠాల్ని ముందే పోలీసులు అరెస్ట్ చేశారు. ఐనా.. కొందరు ఖాకీల కళ్లుగప్పి మత్తుమందులు సరఫరా చేశారు. ఇలా అందిన డ్రగ్స్ నిషాలోనే ఇద్దరు యువకులు యాక్సిడెంట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డ్రగ్స్ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఈ మొత్తం నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com