టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన భేటీ

టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన భేటీ

trs

మున్సిపల్ ఎన్నికలపై టిఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు నేతలను పార్టీ సమావేశాలకు ఆహ్వానించింది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రాథమికగా మున్సిపోల్స్ పై చర్చించారు.

సమావేశంలో సుమారు నాలుగైదు గంటల పాటు మున్సిపోల్స్ పై లోతుగా చర్చించి గెలుపు వ్యూహాలను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలోనే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సీనియర్ నేతలను ఇన్ చార్జీలుగా నియమించింది టీఆర్ఎస్. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఉన్న రాజకీయ పరిస్ధితులు బలాబలాలు సమస్యల పై నివేదిక సిద్ధం చేసిన ఇన్ చార్జిలు ఇప్పటికే పార్టీకి అందచేశారు.

విస్తృత స్థాయి సమావేశంలో ఈ నివేదికలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాల్టీలు కార్పొరేషన్ల వారీగా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సూచనలు, సలహాలు రెబల్స్ తో వ్యవహరించాల్సిన తీరు ఇలాంటి అంశాల పై నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో పని చేసేందుకు కొంత మంది సీనియర్లకు కూడా బాధ్యత అప్పగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకునే విషయంలో అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది .ఇతర పార్టీల నుంచి చేరిన నేతల అనుచరులకు టిక్కెట్లు దక్కించుకునేందుకు పైరవీలు బాగానే నడుస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతుంది. ఆర్థికంగా సత్తా ఉన్న నేతలను బరిలోకి దించితే గెలుపు ఖాయం అంటూ తమ వారికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మొదటి నుంచి టిఆర్ఎస్ లో ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని కెసిఆర్ అధ్యక్షతన జరగబోయే సమావేశం లో ఎమ్మెల్యేలు అధినేత దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story