అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత.. పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు
రాజధాని కోసం రైతుల పోరాటం ఉధృతంగా సాగుతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. సోమవారం భారీ ర్యాలీ చేపట్టగా.. మంగళవారం జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. అయితే, దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనుమతి లేకుండానే ధర్నాలు చేస్తున్నారని.. హైవే దిగ్బంధనానికి అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అటు రైతులు చేస్తున్న పోరాటానికి టీడీపీ మద్దతు ప్రకటించింది. రైతులతోపాటు నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించింది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా టీడీపీ నేతలను కట్టడి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిలో టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. టీడీపీ నేతలతోపాటు రైతుల నిరసనలకు మద్దతిచ్చిన పలు విపక్ష పార్టీల నేతలను హౌస్ అరెస్టు చేశారు. మంగళగిరిలో 40 మంది టీడీపీ ముఖ్య నాయకులు, అమరావతి జేఏసీ నేతలతోపాటు, పలువురు సీపీఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాడేపల్లి టౌన్, రూరల్ టీడీపీ అధ్యక్షులతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇక కృష్ణా జిల్లాలోనూ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెద్ద సంఖ్యలో అమరావతి గ్రామాలకు తరలివెళ్తారనే సమాచారం అందడంతో వారిని ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సహా పలువురు నేతలను ఇళ్లలోంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు చినకాకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జాతీయ రహదారి దిగ్బంధనానికి రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటువైపు ఎవరూ రాకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇక మందడం తుళ్లూరులో మహాధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు వెలగపూడిలో మృతిచెందిన గోపాలరావు కుటుంబ సభ్యులను రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పరామర్శించనున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com