అమరావతి ప్రజల మాన, ప్రాణాలకు కేంద్రం రక్షణ కల్పించాలి: చక్రపాణి మహారాజ్
అమరావతిలో అడుగడుగునా దమనకాండ.. పోలీసుల జులుం.. రాజధాని గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలపై అఖిల భారత హిందూ మహాసభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి దమనకాండపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాకు అఖిల భారత హిందూమహాసభ ఛైర్మన్ చక్రపాణిమహారాజ్ లేఖ రాశారు. మహిళలు, రైతుల పట్ల పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్.. హిట్లర్ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ అణిచివేత చర్యల్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రాజధానిని తరలిస్తున్నారన్న బాధతో రైతుల గుండెలు ఆగిపోతున్నాయని.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు చక్రపాణి మహారాజ్. జగన్ ప్రభుత్వపు దమనకాడంపై విచారణ జరిపించాలని కోరారు. కేంద్రం వెంటనే ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని అన్నారు. ప్రజల మాన ప్రాణాలకు, రైతుల ఆస్తులకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు అఖిల భారత హిందూమహాసభ ఛైర్మన్ చక్రపాణి మహారాజ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com