జనగణన సమావేశానికి వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ డుమ్మా
జాతీయ జనాభా రిజిస్టరు తయారీ, జనాభా గణన కోసం కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ డుమ్మా కొట్టారు. దేశంలో జనాభా గణన కోసం కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసి అన్నిరాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆహ్వానించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమబెంగాల్ సర్కారు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమావేశానికి హాజరుకాలేదు. ఢిల్లీలోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కీలక సమావేశానికి పశ్చిమబెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకే భల్లాలు పాల్గొన్నారు.
2020 జనాభా లెక్కింపు, జాతీయ జనాభా రిజిస్టర్ మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జనగణన జరగనుంది. CAA, NRCలో భాగంగాలోనే NPR చేపడుతున్నారంటూ కొన్ని రాష్ర్టాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ భేటీకి తమ ప్రతినిధులు హాజరుకాబోరని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం తప్ప దేశవ్యాప్తంగా చేపట్టనున్న NPRలో పౌరుల వివరాలు, నివాస ప్రాంతం, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్నికల గుర్తింపు కార్డు వివరాలు సేకరిస్తారని, పాన్ కార్డు వివరాలు నమోదు చేయరని అధికారులు వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com