మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం
మంగళగిరిలోని జనసేన కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం కనిపించింది. రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమైన పవన్ కల్యాణ్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పీఏసీ సమావేశం తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు పవన్ రెడీ అయ్యారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడం సహా ఉదయం నుంచి జరిగిన ఘటనలను తెలుసుకునేందుకు రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు బయలుదేరారు. అయితే, రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే, పవన్ మాత్రం అమరావతి ప్రాంతంలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి విశాఖపై ప్రేమ లేదన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖను పరిపాలన రాజధాని అంటున్నారన్నారు. గతంలో టీడీపీ చేసిన తప్పులే ఇప్పుడు వైసీపీ చేస్తోందన్నారు. ప్రశాంతమైన విశాఖలో ఫ్యాక్షన్ పడగలు విప్పేలా చేస్తున్నారని వపన్ కల్యాణ్ ఫైరయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టనివ్వకపోవడం దారుణమన్నారు. కాకినాడలో పార్టీ కార్యకర్తలపై చేసిన దాడిని మర్చిపోలేనన్నారు. అమరావతిని తరలించడం అసాధ్యమని.. జాతీయ స్థాయిలో బలమైన మార్పులు జరగబోతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com