ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకున్న విచక్షధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు. అయితే, చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార వైసీపీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. పోడియం ఎక్కేందుకు కొందరు మంత్రులు ప్రయత్నం చేశారు. చైర్మన్ పై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.
అంతకుముందు మండలిలో భారీ హైడ్రామా జరిగింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అవసరం లేదని వైసీపీ సభ్యులు వాదించారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రెండు పార్టీల సభ్యులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారు. మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోవడంతో ఏం జరుగుతుందనే విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. చైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదావేశారు.
బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు రాజధానుల కాన్సెప్ట్కు.. కనీసం 3 నెలల బ్రేక్ పడినట్లైంది. మండలి చైర్మన్ చర్యతో.. మొత్తానికి తెలుగుదేశం పార్టీ రాజధాని అంశంలో పైచేయి సాధించినట్లయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com