38వ రోజు ఉధృతంగా రాజధాని రైతుల ఆందోళనలు

38వ రోజు ఉధృతంగా రాజధాని రైతుల ఆందోళనలు

రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 38 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం రాజధాని తరలింపుపై ముందుకు వెళ్తుండడంతో.. ఇవాళ ఇంకాస్త ఉధృతంగా ధర్నాలు, రిలే దీక్షలు, ర్యాలీలకు రైతులు, మహిళలు సిద్ధమవుతున్నారు. మండలిలో మూడు రాజధానుల బిల్లుకు బ్రేక్‌ పడడంతో అమరావతి ప్రాంత రైతులకు ఊరట లభించింది. అయినా పోరుబాట వీడం అంటున్నారు రైతులు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం, పెదపరిమి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం, తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో నిన్న మహిళలు పూజలు నిర్వహించారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ తమ పాలిట దైవంగా నిలిచారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేసి స్వీట్లు పంచిపెట్టారు. మందడం, మల్కాపురం జంక్షన్లలో అంబేడ్కర్‌, షరిఫ్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు.

మందడం గ్రామంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులు, మహిళల ఇవాళ కూడా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి టెంట్‌ల్లో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు అమరావతిలోని హైకోర్టును, రాజధానిని తరలించేందుకు ఒప్పుకోం అంటూ.. మంగళగిరి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ప్రాంగణం దగ్గర రిలేనిరాహార దీక్షలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story