రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

తెలంగాణలో 120 మున్సిపాల్టీలు.. 9 కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైనవి కాకుండా పురపాలక సంఘాల్లోని 2 వేల 647 వార్డులు, కార్పొరేషన్లలోని 324 డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఎలాంటి వివాదాలు, గందరగోళానికి తావులేకుండా కౌటింగ్ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వార్డుల వారీగా ఫలితాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా టేబుళ్లను ఏర్పాటు చేశారు. 24 వార్డులు అంతకంటే ఎక్కువ ఉన్న చోట వార్డుకు ఒక టేబుల్ ఉంటుంది. తక్కువ వార్డులున్న పురపాలక సంఘాల్లో రెండు వార్డులకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపే కౌంటింగ్ పూర్తయ్యేలా కసరత్తు చేస్తున్నారు..

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి గంట కౌంటింగ్ ముందస్తు ప్రక్రియకు తీసుకుంటుంది. తొమ్మిది గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. పోలైనఓట్లను బండిళ్లుగా కట్టిన తర్వాత లెక్కింపు చేపడుతారు. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి మూడు టేబుళ్లను ఒక రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షిస్తారు.

శనివారం సాయంత్రానికి పూర్తి ఫలితాలు వస్తాయని.. ఈనెల 27న మేయర్లు, ఛైర్ పర్సన్ల ఎంపిక ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ కౌంటింగ్ ఈనెల 27న...మేయర్ ఎన్నిక 29న ఉంటుంది. మొత్తం 60 డివిజన్లలో రెండు ఏకగ్రీవం కావడంతో 58 డివిజన్లకు ఓటింగ్ జరిగింది. ఇక టెండర్ ఓట్లు నమోదైనమూడు వార్డుల్లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహించారు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెండు, మహబూబ్ నగర్ లోని ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ ముగిసింది.

Tags

Read MoreRead Less
Next Story