నేరేడుచర్లలో ఎంపీ కేవీపీకి ఎక్స్ అఫీషియో ఓటు హక్కు..
తెలంగాణలో ఉత్కంఠభరితంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక కొనసాగుతోంది. పలు చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లుకీలకం కావడంతో ఛైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా జరుగుతుంది. దాదాపు 110 మున్సిపల్ పీఠాలకు పైగా టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. కొన్ని చోట్ల ఎన్నిక సాఫీగా జరిగేందుకు గులాబీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. మరి కొన్ని చోట్ల ఇతరుల మద్దతు, తమ పార్టీకి చెందిన ఎక్స్ అఫీషియో అస్త్రంతో .. ప్రతిపక్షాల గెలిచిన చోట కూడా ఛైర్మన్ల పీఠాలకు సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
చౌటుప్పల్ పురపాలక కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎంపిక తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. యాదగిరిగుట్టలో సీపీఎంతో కలిసి కాంగ్రెస్కు 7 ఓట్లు, ఎక్స్ అఫీషియోతో కలిపి టీఆర్ఎస్కు ఆరు ఓట్లు మాత్రమే ఉన్నాయి. సీపీఎం అభ్యర్థిని తనవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపలకు వెళ్తున్న సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పురపాలక సంఘం కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి అధికార టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ సఫలమైంది. 14వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ సభ్యురాలు హారిక టీఆర్ఎస్లో చేరడంతో పీఠం కైవసం చేసుకుంది.
నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రాంచద్ర రావుకి ఎక్స్ అఫీషియో ఓటు హక్కు కల్పించారు. కేవీపీ ఓటు రద్దు చేస్తూ నేరేడుచర్ల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో సాయంత్రం 4 గంటలకు మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నిక జరగనుంది.
పెద్ద అంబర్పేట మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ నుంచి చేజారింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇక్కడ ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, నవీన్ కుమార్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com