మేడారం జాతరపై కేసీఆర్ దిశానిర్ధేశం

మేడారం జాతరపై కేసీఆర్ దిశానిర్ధేశం

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు మేడారం వెళ్లి, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించడానికి, ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్ లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి భవన్ లో కేసీఆర్ కు అందించారు. ముఖ్యమంత్రిని మేడారం జాతరకు ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమీక్షలో కేసీఆర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున.. మంచినీరు, పారిశుధ్యం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు మంచిది కాదని హెచ్చరించారు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలని కేసీఆర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అక్కడికి పంపించాలని సూచించారు. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story