కరోనా ఎఫెక్ట్‌.. చైనాలో చిక్కుకున్న 30మంది తెలుగు విద్యార్థులు

కరోనా ఎఫెక్ట్‌.. చైనాలో చిక్కుకున్న 30మంది తెలుగు విద్యార్థులు

చైనాలోని వుహాన్‌ నగరంలో 30 మంది విశాఖ విద్యార్థులు చిక్కుకున్నారు. చైనాను కరోనా వైరస్‌ వణికిస్తుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నారు. విదేశీ విద్యార్థులను ఎవరికీ తెలియని సురక్షిత ప్రాంతాల్లో ఉంచి వారికి పరీక్షలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖకు చెందిన 30 మంది విద్యార్థులను నిర్బంధంలో ఉంచారు అక్కడి అధికారులు. వారంతా విశాఖలోని గీతం, అనిట్స్‌ ఇంజనీరింగ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎంపికై శిక్షణ కోసం చైనా వెళ్లారు.

చైనా స్టార్ ఆప్టో ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ సంస్థలో శిక్ష పొందేందుకు వెళ్లారు. వారి శిక్షణ వచ్చే నెల 23తో ముగియనుంది. అయితే ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో.. అంతా భారత్‌కు వచ్చేయాలని వారి తల్లిదండ్రులు కోరారు. ఇక స్వదేశానికి వచ్చేద్దామనుకుంటున్న సమయంలో చైనా అధికారులు వారిని నిర్బంధించారు. దీంతో అక్కడ ఏం జరుగుతోందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

విదేశాంగ చొరవ చూపి తమ పిల్లలను సురక్షితంగా భారత్‌కు రప్పించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖకు వారి స్నేహితులు, బంధువులు విజ్ఞప్తులు పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story