ఢిల్లీలో విద్యార్థులు నిరసన తెలుపుతుండగా తుపాకితో కాల్పులు జరిపిన వ్యక్తి
సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. భారీగా మోహరించిన పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమంటూ వామపక్షాలు, ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఆరోపించాయి.
గాంధీ వర్ధంతి సందర్భంగా జామియా వర్సిటీ విద్యార్థులు నిన్న రాజ్ఘాట్ వరకు సీఏఏ నిరసన ర్యాలీ చేపట్టారు. జామియా నగర్లోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ సమీపానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతోపాటు విద్యార్థులను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులంతా బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గోధుమ రంగు ప్యాంటు, నలుపు రంగు జాకెట్ ధరించిన ఒక వ్యక్తి వచ్చి నిరసనకారులపైకి తుపాకి ఎక్కుపెట్టి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు.
కాల్పుల ఘటనతో జామియా నగర్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. విద్యార్థులకు మద్దతుగా వేల మంది స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బారికేడ్లను ధ్వంసం చేసి వర్సిటీవైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనాస్థలంతోపాటు వర్సిటీ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు నిరసనలు కొనసాగాయి.
ఇలాంటి ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. కేంద్రమే హింసను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com