తూర్పుగోదావరి జిల్లాలో ఎగిసిపడుతున్న ONGC గ్యాస్
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ONGC గ్యాస్ ఎగిసిపడుతోంది. భారీ శబ్దాలతో గ్యాస్ ఎగిసి పడుతుండటంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించారు. అమలాపురం ఆర్టీఓ భవానీ శంకర్ , ముమ్మిడివరం సీఐ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఉప్పూడి గ్రామంలో గ్యాస్ అంతకంతకూ వ్యాప్తి చెందడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఎవరూ స్టౌవ్లు వెలిగించవద్దంటూ .. అగ్నిప్రమాదం సంభవించేందుకు దోహదం చేసే ఏ విధమైనా వస్తువులు ఉపయోగించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఉప్పూడి గ్రామానికి విద్యుత్ సరఫరాతో పాటు దగ్గరలో ఉన్న సెల్ టవర్ సేవలు కూడా నిలిపివేశారు. సెల్ఫోన్లు కూడా ఉపయోగించవద్దని అమలాపురం డిఎస్పీ షేక్ నయీం భాషా హెచ్చరించారు. అమలాపురం, ముమ్మిడివరం నుంచి ఫైరింజన్లు రప్పించి గ్యాస్ లీకేజీ ప్రాంతంలో వాటర్ కొట్టిస్తున్నారు.
ఉప్పూడిలో 10 సంవత్సరాల క్రితం ONGC సంస్థ ఆయిల్ నిక్షేపాల నిమిత్తం డ్రిల్లింగ్ చేసింది. లో ప్రేజర్ గ్యాస్ ఉండడంతో డ్రిల్లింగ్ పూర్తి చేసి సీల్ వేశారు. అయితే ఇవాళ చెకింగ్ నిమిత్తం సిబ్బంది వచ్చారు. రిగ్ మరమత్తులు నిర్వహించే సమయంలో వాల్ వదిలివేయడంతో గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసి పడింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com