ప్రభుత్వ వైద్యులందరూ అందుబాటులో ఉండాలి : మంత్రి ఈటెల రాజేందర్
కరోనా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముందస్తు చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చిక్సిత చేయడం కోసం ఏర్పాట్లు చేయాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన సూచనలకు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
మరోవైపు ఈరోజు నుంచి గాంధీ మెడికల్ కాలేజీలోని కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.. ప్రతి రోజు 30 మందికి పరీక్షలు చేయడానికి కిట్ అందుబాటులో ఉంచారు అధికారులు. ఒక పరీక్షకు 10 గంటల సమయం పట్టనుంది. ఇప్పటి వరకు ఈ పరీక్షలను పుణెలో చేస్తుండగా.. రిజల్ట్ రావడానికి ఆలస్యమవుతున్న నేపథ్యంలో కిట్లు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని కోరింది.. దీంతో ఒక కిట్ను రాష్ట్రానికి పంపింది. ఇక కరోనా అనుమానిత లక్షణాలతో మరొకరు ఆస్పత్రిలో చేరారు. దీంతో గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో అనుమానితుల సంఖ్య 19కి చేరింది. వీరిలో 11 మందికి వైరస్ లేదని నిర్ధారణ కాగా మరో ఎనిమిది మంది ఫలితాలు రావాల్సి ఉంది..
మరోవైపు ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రజలెవ్వరూ భయాందోళనకు గురికావద్దని మంత్రి సూచించారు. చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రుల్లో చేరిన వారికి చికిత్స అందించేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని, మాస్క్లు, సానిటైజర్లు, సరిపోయేంత మంది సిబ్బంది సిద్ధంగా ఉంచామని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com