లాస్ట్ స్టేజ్‌కు చేరిన ఢిల్లీ ఫైట్.. బీజేపీకి ధీటుగా ఆమ్ ఆద్మీ ప్రచారం

లాస్ట్ స్టేజ్‌కు చేరిన ఢిల్లీ ఫైట్.. బీజేపీకి ధీటుగా ఆమ్ ఆద్మీ ప్రచారం

ఢిల్లీ ఫైట్ లాస్ట్ స్టేజ్‌కు చేరింది. ప్రచారానికి మూన్నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోరాటం తారాస్థాయికి చేరింది. రెండు పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలతో పాటు పౌరసత్వ సవరణ చట్టం, షహీన్‌బాగ్-జామియా మిలియా ఆందోళనల చుట్టూనే ప్రచారం సాగుతోంది. రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారం కోసం ఎదురుచూస్తున్న కమలదళం, ఈసారి ఎలాగైనా పవర్ చేజి క్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే సీనియర్ నేతలు ప్రచారం చేస్తుండగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. ఢిల్లీలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల ధ్యేయమని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.

సీఏఏ వ్యతిరేక నిరసనలపై మోదీ ఘాటుగా స్పందించారు. నిరసనల పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. హింసాత్మక ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కాబోవని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లు, బహిరంగ సమావేశాలతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మోదీ సర్కారు అభివృద్ధి సంక్షేమ పథకాల ను వివరిస్తూనే ఆప్, కాంగ్రెస్‌లపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు.

బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేస్తోంది. సీఎం కేజ్రీవాల్ రోడ్‌ షోలతో రఫాడిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మహిళలు, పేదలకు ఉచిత ప థకాలను వల్లె వేస్తున్నారు. కేంద్రం సహకారం లేకపోవడం వల్లే ఢిల్లీ అభివృద్ధి వేగంగా జరగడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద పెద్ద నాయకులెవ్వరూ హస్తినవైపు చూడడం లేదు. స్థానిక నాయకులే ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపుపై పెద్దగా ఆశలు లేవని కాంగ్రెస్ శ్రేణులే అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story