50వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

అమరావతిలో ఉధృతంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. రాజధాని కోసం 29 గ్రామాల ప్రజలు రోడ్డెక్కి నేటికి 50 రోజులైంది. 50 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బుధవారం వినూత్న నిరసనలకు పిలుపిచ్చారు జేఏసీ నేతలు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారితో కలిపి నేడు నిరసనలు చేపట్టనున్నారు.
50 రోజులుగా అలుపు లేకుండా ఉద్యమం చేస్తున్న రైతులు.. అమరావతి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటున్నారు. బుధవారం దీక్షలు, ధర్నాలు, మహా ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టానున్నారు. మందడం, తుళ్లూరులో మహాధర్నా చేపట్టనున్నారు. వెలగపూడిలో 50వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగనున్నాయి. నేడూ కూడా రైతుల 24 గంటల దీక్షలు కొనసాగుతున్నాయి.
మరోవైపు రాజధాని గ్రామాల్లో మరోసారి చంద్రబాబు పర్యటించనున్నారు. నేటికి నిరసనలు చేపట్టి 50 రోజులు కావడంతో రైతులను కలిసి చంద్రబాబు పరామర్శించనున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు సెంటర్లలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న నిరసన దీక్షా శిబిరాలను సందర్శించి.. వారిని పరామర్శించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com