నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు సంచలన తీర్పు.. హాజీపూర్‌ కిల్లర్‌కు ఉరిశిక్ష

నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు సంచలన తీర్పు.. హాజీపూర్‌ కిల్లర్‌కు ఉరిశిక్ష

హాజీపూర్‌ వరుస హత్యల కేసులో సంచలన తీర్పు వెల్లడించింది నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఈ కేసులో సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష ఖరారు చేసింది. గత జనవరి 27నే తీర్పు వస్తుందని అనుకునప్నప్పటికీ అనివార్య కారణాల వల్ల కేసును గురువారం వాయిదా వేసిన కోర్టు.. కీలక తీర్పు ప్రకటించింది. ఆ మధ్య వరంగల్ కేసు, తర్వాత దిశ కేసు, మొన్న సమత కేసు, ఇవాళ హాజీపూర్‌ కేసుల్లో దోషులకు ఉరిశిక్షలు వేయడంపై మెజార్టీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అలాంటి కామాంధులకు ఉరే సరైన శిక్ష అని అభిప్రాయపాడుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. శ్రావణి, మనీషా, కల్పన లను చంపినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది ఏప్రిల్ 25న హాజిపూర్ గ్రామానికి చెందిన శ్రావణి కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు వ్యవసాయ బావి వద్ద.. ఆ బాలిక స్కూల్ బ్యాగ్ ను గుర్తించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అదే గ్రామానికి చెందిన మనీషాతో పాటు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనను సైతం అత్యాచారం చేసి చంపినట్లుగా తేలింది. అతనిచ్చిన సమాచారంతోనే బావిలో తవ్వకాలు జరిపి ఆ ఇద్దరు బాలికల అస్థికలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఈ కేసుపై జులై 31 నుంచి ప్రత్యేక ఫోక్సో కోర్టులో విచారణ కొనసాగింది. బాలికల హత్య కేసులను విచారించిన న్యాయస్థానం.. అన్ని కోణాలనూ పరిశీలించింది. ఫోరెన్సిక్ తో పాటు సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు వాటిని సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు. మొత్తం 101 మంది సాక్షులను విచారించిన కోర్టు.. వారి సాక్ష్యాలను నమోదు చేసింది. కిల్లర్‌ శ్రీనివాస్‌ అభిప్రాయాన్ని కూడా తీసుకొని.. ఉరి శిక్ష విధించింది.

Tags

Read MoreRead Less
Next Story