ప్రజలు అద్భుతాలేమీ ఆశించడం లేదు : కేటీఆర్‌

ప్రజలు అద్భుతాలేమీ ఆశించడం లేదు : కేటీఆర్‌

పురపాలన పూర్తిగా పౌరుల కేంద్రంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పౌరసేవలు పారదర్శకంగా, అవినీతి రహితంగా, వేగంగా అందించాలన్నారు. పురపాలనలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావాలని వారికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పురపాలక చట్టాన్ని ప్రతీ మున్సిపల్ కమిషనర్ తన విధి నిర్వహణలో జాబ్ చార్ట్‌గా పరిగణించాలన్నారు. పట్టణ ప్రజలు అధికారుల నుంచి అద్భుతాలేమీ ఆశించడం లేదని, వారి ప్రాథమిక అవసరాలు, పౌర సేవలందిస్తే సరిపోతుందన్న భావంతో ఉన్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆదిశగా పని చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలంటే అధికారులు స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

నూతన పురపాలక చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్లైన్ సేవలు, టెక్నాలజీ వినియోగం, గ్రీవెన్స్ రిడ్రెస్సెల్, ఎలాంటి అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్‌ చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు పని చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేయాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పట్టణాల్లో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రతి పట్టణానికి శానిటేషన్ ప్లాన్ తో పాటు గ్రీన్ ప్లాన్ కూడా తయారు చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన పౌరసేవలు అవినీతి రహితంగా, అత్యంత పారదర్శకంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక నూతన చట్టాలు చేస్తోందని కేటీఆర్‌ గుర్తు చేశారు. టీఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో ప్రజలకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠినమైన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఏ అధికారైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే అత్యంత కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్‌ హెచ్చరించారు.

పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని, పౌరులతో సంబంధాలని పెంచుకునే విషయంలో మరింత చొరవ చూపించాలని కమిషనర్లను మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను, నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story