శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా? అని అడిగితే..

శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా? అని అడిగితే..

హాజీపూర్‌ వరుస హత్యల కేసులో సంచలన తీర్పు వెల్లడించింది నల్లగొండ ప్రత్యేక పోక్సో కోర్టు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఈ కేసులో... సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష ఖరారు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 109, 110 కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ... కోర్టు తీర్పు వెలువరించింది. గత జనవరి 27నే తీర్పు వస్తుందని అనుకునప్నప్పటికీ అనివార్య కారణాల వల్ల కేసు తీర్పు వాయిదా పడింది..

తీర్పు ప్రకటించే ముందు న్యాయమూర్తి శ్రీనివాస్‌ రెడ్డి స్పందన కోరారు. ఇప్పటికే నేరం నిరూపితమైందని, శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా? అని న్యాయమూర్తి ఎస్‌వీవీ నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. అయితే ఈ హత్యలతో సంబంధం లేదన్నాడు శ్రీనివాస్‌రెడ్డి. తన ఇల్లు సైతం తగలబెట్టారని, తన భూములను లాగేసుకున్నారని రోధిస్తూ చెప్పాడు. 3 కేసుల్లోనూ నేరం నిరూపితమైందని, 11 ఏళ్ల బాలికను ముక్కు మూసి చంపినట్లుగా తేలిందన్నారు న్యాయమూర్తి. అయినా కూడా తాను నిరపరాధినని, తన తల్లిదండ్రులకు ఎలాంటి ఆసరా లేదని వాపోయాడు శ్రీనివాస్‌రెడ్డి. అయితే వారు ఎక్కడున్నారని జడ్జి ప్రశ్నించగా.. తనకు తెలీదని సమాధానం ఇవ్వడం విశేషం. బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి చేసింది క్షమించరాని నేరమన్న న్యాయమూర్తి ... శ్రావణి, కల్పనలపై అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష విధించగా, మనీషాపై అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు విధించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి..... లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. శ్రావణి, మనీషా, కల్పన లను చంపేశాడు. గతేడాది ఏప్రిల్ 25న హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి కనిపించడం లేదన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు వ్యవసాయ బావి వద్ద.. ఆ బాలిక స్కూల్ బ్యాగ్ ను గుర్తించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అదే గ్రామానికి చెందిన మనీషాతో పాటు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనను సైతం అత్యాచారం చేసి చంపేసినట్లుగా తేలింది.

ఈ కేసుపై ప్రత్యేక పోక్సో కోర్టులో విచారణ కొనసాగింది. బాలికల హత్య కేసులను విచారించిన న్యాయస్థానం.. అన్ని కోణాలనూ పరిశీలించింది. ఫోరెన్సిక్ తో పాటు సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు వాటిని సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు. మొత్తం 101 మంది సాక్షులను విచారించిన కోర్టు.. వారి సాక్ష్యాలను నమోదు చేసింది. కిల్లర్‌ శ్రీనివాస్‌ అభిప్రాయాన్ని కూడా తీసుకొని.. ఉరి శిక్ష విధించింది. కోర్టు తీర్పు పట్ల గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి..

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే పైకోర్టులు సైతం.. ఇదే తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇటీవలే వరంగల్ కేసు, తర్వాత దిశ కేసు, సమత కేసులో ఉరిశిక్షలు విధించిన కోర్టులు.. ఇప్పుడు హాజీపూర్‌ కేసులోనూ అదే శిక్ష విధించడంతో చట్టాలపై మరింత నమ్మకం ఏర్పడిందంటున్నారు ప్రజలు.

Tags

Read MoreRead Less
Next Story