జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలని సర్వమత ప్రార్ధనలు..
అధికార వికేంద్రీకరణ పేరుతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజధాని ప్రాంత రైతులు రగిలిపోతున్నారు. 52 రోజులుగా వివిధ రూపాల్లో తమ ఆందోళనలు తెలియజేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులది త్యాగం కాదా..? అంటూ నిలదీస్తున్నారు. అమరావతిని చంపి విశాఖను అభివృద్ధి చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మందడం, తుళ్లూరులో మహాధర్నా నిర్వహించగా.. వెలగపూడిలో రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో యువకులు 151 గంటల దీక్ష దిగారు. పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు వీరికి సంఘీభావం ప్రకటించారు.
ఇక రాయపూడి వద్ద కృష్ణానదిలో వెలగపూడి గ్రామస్తులు జలదీక్ష చేశారు. జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. రాయపూడిలో రైతులు, మహిళలు సర్వమత ప్రార్ధనలు చేశారు. కడప, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లింలు రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు.
ఇక జై అమరావతి నినాదాలతో విజయవాడ మారుమోగింది. రాజధానికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ డిమాండ్ చేశారు. కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార సెంటర్ వరకూ జరిగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా లోకం కదంతొక్కింది. ర్యాలీలో వంగవీటి రాధాకృష్ణ, గద్దె అనురాధ, వివిధ పార్టీల నేతలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్ తీరుపై వంగవీటి రాధా మండిపడ్డారు. 52 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా సీఎంకు కనపడటం లేదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ముందు శనివారం విద్యార్ధి యువజన జేఏసీ నేతల ఆందోళన నిర్వహించనున్నారు. 52 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా సినీ ఇండస్ట్రీ ఏ మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు తెలిపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరులో స్వరూపానందేంద్ర స్వామికి అమరాతి సెగ తగిలింది. గోరంట్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన స్వరూపానందేంద్రను స్థానిక మహిళా భక్తులు నిలదీశారు. అమరావతికి మద్దతు తెలపాలంటూ కోరారు. జై అమరావతి అంటూ స్వరూపానందేంద్ర వాహనం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన వైసీపీ నేతలు హడావుడిగా ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వైసీపీ నేతల తీరుపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇక పలువురు అమరావతి మహిళలు, రైతులు మేడారం తరలివెళ్లారు. రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలంటూ వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com