కోవిడ్-19 : చైనాలో 14 వందలకు పైగా మరణాలు

చైనాలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో తొలి కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు మరణాల సంఖ్య 14 వందలు దాటింది. మరో 60 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్-19 తీవ్రత హుబయ్ ప్రావిన్స్లో అత్యధికంగా ఉంది..ఒక్క ఈ ప్రాంతంలోనే 13 వందల మందికిపైగా చనిపోయారు.ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రజలు ఇళ్లల్లో బందీలుగా మారారు. గడపదాటి బయటకు వచ్చే సాహసం కూడా చేయడం లేదు.
చైనాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకీ పెరగడంతో వైద్య సిబ్బందిపైనా ఒత్తిడి పెరుగుతోంది. నిద్ర కూడా సరిగా లేకపోవడంతో చాలామంది వైద్యులు, నర్సులు ఆస్పత్రిలోని కుర్చీలు, బెంచీల పైనే కాసేపు ఒరిగి సేదతీరుతున్నారు. నిత్యం జన సంచారంతో నిండిపోయి
కిటకిటలాడే చైనాలోని నగరాలన్నీ బోసిపోయాయి. ఎడారిని తలపిస్తున్నాయి. జనం బయటకు వచ్చేందుకే భయపడటంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. అనేక పరిశ్రమలను మూసివేయడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.
కోవిడ్ వైరస్ అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో చైనాలో విద్యాసంస్థలతో పాటు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. చైనాకు సమీపంలోని దేశాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగం ఇప్పటికే నెమ్మదించింది. ఆయా దేశాలు చైనాకు వెళ్లిన పర్యాటకులను తమ దేశాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
ఇండియాలోనూ కరోనా వైరస్ టెన్షన్ కొనాసగుతోంది. ఇప్పటికే కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ఒకరు రికవరీ అయ్యారు. మిగతా ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది..కేరళలో ఇప్పటి వరకు 2 వేల మందికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. గురువారం కోలకతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. బ్యాంకాక్ నుంచి కోలకతా చేరుకున్న ప్రయాణికుడిని కరోనా పాజిటివ్గా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. దీంతో కోల్కతాలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. అంతకుముందు హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాలను కూడా కరోనా భయం వెంటాడుతోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా జనం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు..గాంధీలో కరోనా టెస్టులు నిర్వహిస్తుండటంతో... ఇక్కడికి క్యూ కడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు..ప్రజలు ఆందోళన చెందొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com