భారత్‌లోనూ ఓ ఉసేన్‌ బోల్ట్‌.. 100 మీటర్లు కేవలం 9.55 సెకన్లలోనే

భారత్‌లోనూ ఓ ఉసేన్‌ బోల్ట్‌ మెరిసాడు.. అది ఉసేన్‌ బోల్ట్‌ కంటే వేగంగా పరిగెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే వీరుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు ఉసేన్‌ బోల్ట్‌.. చిరుత వేగంతో జమైకన్‌ పరుగుల వీరుడు బోల్ట్‌ ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. 100 మీటర్లు రేసును కేవలం 9.58 సెకన్లలోనే పూర్తి చేసిన ఒకేఒక్క అథ్లెట్‌గా నిలిచాడు. అయితే అతడిని మించిన వేగంతో ఓ అనామకుడు భారత్‌లో రాత్రికి రాత్రే సూపర్‌స్టారయ్యాడు. కంబళ పోటీల్లో పరుగుతో రికార్డులను చెరిపేశాడు.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూదబిద్రకి చెందిన శ్రీనివాస గౌడ సంప్రదాయక కంబళ పోటీల్లో 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే అధిగమించాడు. అయితే ఇదంతా మామూలు ట్రాక్‌పై కాకుండా బురద నీళ్లలో.. రెండు దున్నలను కట్టేసి ఉంచిన తాడును పట్టుకుని ఈ పరుగు తీసి శెభాష్‌ అనిపించుకున్నాడు. అయితే శ్రీనివాస గౌడ వేగాన్ని 100 మీటర్ల దూరానికి లెక్కేస్తే అది 9.55 సెకన్లుగా తేలింది. దీంతో అతడు బోల్ట్‌కంటే కూడా 03 సెకన్లు ముందుగానే పరిగెత్తినట్టు లెక్కిస్తున్నారు..

ఈ రికార్డును నేరుగా బోల్ట్‌తో పోల్చలేమంటున్నారు క్రీడా నిపుణులు. ఎందుకంటే శ్రీనివాస గౌడ వేగం అతడి దున్నల నుంచి జనించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. కర్ణాటకలోని మంగళూరు, ఉడుపిలో ఈ పరుగు పందేలను ఏటా నిర్వహిస్తుంటారు. ఎవరైతే వాటిని వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. అయితే బోల్ట్‌తో పోలిక ఎలా ఉన్నా ఈక్రమంలో అతను కంబళ పోటీల్లో 30 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ అత్యంత వేగంగా పరిగెత్తిన వ్యక్తిగా నిలిచాడు. ఓ జర్నలిస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇతడి ఫీట్‌ గురించి అందరికీ తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story