పట్టు వీడని అమరావతి రైతులు.. వెనక్కి తగ్గని ప్రభుత్వం

పట్టు వీడని అమరావతి రైతులు.. వెనక్కి తగ్గని ప్రభుత్వం

అమరావతి ఉద్యమం 62వ రోజు కొనసాగింది. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని భావించినా.. నిరసనలను పక్కదారి పట్టించాలని యత్నించినా.. రైతులు తమ సంకల్పాన్ని వీడడం లేదు. ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం లేదు. 62వ రోజు కూడా దీక్షలు, ధర్నాలతో ముందుకు సాగారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం చెప్పేదాకా.. పోరాటం చేస్తామంటున్నారు రైతులు.

మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంతో పాటు రాజధాని గ్రామాల్లో ఉద్యమం ఉదృతంగా కొనసాగుతోంది. రైతులు తమ దీక్షల్ని కొనసాగిస్తున్నారు. రాజధాని కోసం ఎన్ని రోజులైనా ఉద్యమిస్తామంటున్నారు రైతులు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.

మరోవైపు ఈ పోరాటంలో అలిసిపోయి మరో గుండె ఆగింది. వెలగపూడికి చెందిన జెట్టి సోమేలు గుండెపోటుతో మరణించాడు. రాజధాని తరలిపోతోంది, పనులు ఉండవని కొన్నాళ్లుగా సోమేలు ఆవేదనతో ఉన్నాడు. రోజూ రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. ప్రభుత్వ మొండి వైఖరితో భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో వెలగపూడిలో విషాదం నెలకొంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మహిళనేత పురందేశ్వరిని కలిశారు అమరావతి మహిళా జేఏసీ, మహిళా రైతులు. తమ విజ్ఞాపన పత్రం దజేశారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని ఉద్యమంలో మహిళలు అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. వృద్ధ మహిళలకు ఆరోగ్యం సహకరించకపోయినా పగలనక రాత్రనకా దీక్షలు చేస్తూనే ఉన్నారు. 62 రోజులుగా ఉద్యమం చేస్తున్న చీమ కుట్టినట్టు కూడా లేని ఈ ప్రభుత్వం.. త్వరలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story