ప్రభుత్వం మా జీవితాలతో ఆడుకుంటోంది : అమరావతి రైతులు
రాజధాని ఉద్యమం 68వ రోజకు చేరింది. 29 గ్రామాల్లో నిరసనలు ఆగడం లేదు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలను ఇవాళ కూడా కొనసాగించనున్నారు. కృష్ణాయపాలెం, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, పెనుమాక, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంలో ఆందోళనలు ఇంకాస్త తీవ్ర చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు రైతులు. 2 నెలలుగా ఆందోళనలు చేస్తున్నా స్పందించని ప్రభుత్వం.. అడుగడుగునా ఆంక్షలతో ఇబ్బందులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ నేతల్ని గెలిపించడమే మేం చేసిన తప్పా అంటూ నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించడంపై ఫైర్ అయ్యారు.
68 రోజులుగా రాజధాని కోసం రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన లేదని మండిపడ్డారు టీడీపీ నేతలు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందదని విమర్శించారు. రైతుల త్యాగాలను చిన్న చూపు చూడడం తగదన్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన టీడీపీ నేతలు రైతులకు సంఘీభావం తెలిపారు.
24 గంటల దీక్ష చేస్తున్న మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు ఎంపీ గల్లా జయదేవ్. అదే సమయంలో రైతు వాసుదేవరావు ఒక్కసారిగా అనార్యోగానికి గురై కుప్పకూలాడు.. అక్కడే ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత.. విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.
మందడంలో రైతులకు వామపక్ష నేతలు మద్దుతు ప్రకటించారు. చేయని నేరానికి రైతులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఎంపీ నందిగం సురేష్కు గులాబీ పూలు ఇచ్చి నిరసన తెలిపిన ఘటనలో అరెస్టైన యువకులు విడుదలయ్యారు. జై అమరావతి అన్నందుకు 17 రోజులు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు మహిళ సంఘాల పొలిటకల్ జేఏసీ సంఘీభావం ప్రకటించింది. రాజధాని గ్రామాల్లో పర్యటించిన మహిళా నేతలు.. కేపిటల్ను విశాఖకు తరలించాల్సిన అవసరం ఏ మొచ్చిందని నిలదీశారు..
అమరావతి ఉద్యమానికి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు పలుజిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు ప్రజలు. విశాఖ వాసులు సైతం అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com