కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు కుట్ర

కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు కుట్ర

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు కుట్ర జరిగింది. పీలేరుకు చెందిన రౌడీషీటర్‌ గణేష్‌‌కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి విద్యాసాగర్‌ను హత్య చేయించేందుకు సొంత పార్టీకి చెందిన నేతలే ప్లాన్ చేశారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తం కూడా చెల్లించారు. ఈ మర్డర్‌ ప్లాన్‌ వెనుక వైసీపీ అగ్రనేతలు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే డీల్‌ కుదుర్చుకున్న గణేషే.. విద్యాసాగర్‌కు ఫోన్ చేసి మర్డర్‌ కుట్రను వెల్లడించారు. సుపారీ కూడా ఇచ్చారని చెప్పాడు. తాను చంపకపోయినా వేరేవాళ్లతోనైనా మర్డర్ చేయించే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. అప్రమత్తమైన విద్యాసాగర్.. వెంటనే పోలీసులను అశ్రయించారు.

తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుపారీ ఇచ్చింది ఎవరు? దీని వెనుక ఎవరున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. డీల్‌ కుదుర్చుకున్న గణేష్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇతడు ఇప్పటికే ఓ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు విద్యాసాగర్. గతంలో కుప్పం టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగా 2018లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు.

Tags

Read MoreRead Less
Next Story