తిరుమల సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి ఆత్మహత్య

తిరుమల సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి ఆత్మహత్య

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి రెండో సత్రంలో సూపరింటెండెంట్‌ స్థాయి అధికారిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డి అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సౌమ్యుడిగా ఉండే ఉమాశంకర్‌రెడ్డి ఆత్మహత్యకు.. తిరుమలలోని ఓ ఉన్నతాధికారి వేధింపులే కారణమని తెలుస్తోంది. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ... ఉమాశంకర్‌రెడ్డి సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సూసైడ్‌ నోట్‌ను బయటపెట్టకపోవడం, ఆగమేఘాలమీద పోస్ట్‌ మార్టం పూర్తి చేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీడీ ఛైర్మన్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన ఉమాశంకర్‌రెడ్డి... నిజాయితీగా వ్యవహరిస్తూ... ముక్కుసూటిగా మాట్లాడేవారని తెలుస్తోంది. సుపథం దర్శనం టికెట్ల మంజూరిలో ఉమా శంకర్‌రెడ్డికి తిరుమలలోని ఓ టీటీడీ ఉన్నతాధికారి అందిరి ముందే వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఉమాశంకర్‌రెడ్డి తాను.. నిజాయితీగా వ్యవహరిస్తున్నానని ఎవరికీ భయపడనని... తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలంటూ సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అతన్ని ఛైర్మన్‌ కార్యాలయం నుండి బదిలీ వేటు వేశారని ప్రచారం జరుగుతోంది.

గతంలో ఆర్జితం కార్యాలయం, మార్కెటింగ్‌ విభాగం, బోర్డ్‌ సెల్‌, ఛైర్మన్‌ క్యాంప్‌ ఆఫీస్‌, తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఉమాశంకర్‌రెడ్డి... ఇలా ఆత్మహత్యకు పాల్పడటం టీటీడీ ఉద్యోగులను దిగ్ర్బాంతికి గురి చేసింది. గతంలో తిరుమల ఉన్నతాధికారి కార్యాలయంలో సీసీగా పనిచేసిన సురేష్‌ అనే టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరిచిపోక ముందే.. ఈ ఘటన వెలుగులో రావడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

విధినిర్వహణలో ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న టిటీడీ ఉద్యోగులు.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉమాశంకర్‌రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఏ స్థాయిలో ఉన్నా... కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story