పొలాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. పురుగుల మందు డబ్బాలతో రైతులు

పొలాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. పురుగుల మందు డబ్బాలతో రైతులు

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న సాకుతో... రైతుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోంది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో తమ పొలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆందోళనకు దిగారు రైతులు. పొలంలో పురుగుల మందు డబ్బాలతో కూర్చున్నారు.

ఆర్మీలో పనిచేసిన వారికి అప్పట్లో ప్రభుత్వం భూములు ఇచ్చింది. వారి నుంచి రైతులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పడు ఆ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ .. పేదల ఇళ్ల స్థలాలకు ఈ భూమిని కేటాయించామని రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టారు. తమకు జీవనాధారంగా ఉన్న భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ పొలంలోనే పురుగు మందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. పేదలకు ఇళ్ల పేరుతో తమ భూములు లాక్కున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలోనూ.. తమ పొలాలను ప్రభుత్వం దోచుకునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా పచ్చని పొలాన్ని దున్నేశారు అధికారులు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో జరిగింది. బాధిత రైతు గుండు పోతురాజును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు.

అటు కర్నూలు జిల్లాలో అధికారుల తీరుతో మనోవేదనకు గురై మిడుతూరు మండలం రోళ్లపాడుకి చెందిన మహిళా రైతు రాజమ్మ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల రోడ్డు పక్కన ఉన్న 4 ఎకరాల 20 సెంట్ల భూమిని 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. ఈ భూమిలో 3 ఎకరాల 50 సెంట్లను అధికారులు బలంవంతంగా లే అవుట్లు వేశారు. తమకు ఈ పొలం తప్ప మరో జీవనాధారం లేదని వేడుకున్నా.. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించిలేదు. దీంతో రాజమ్మ మనో వేదనకు గురై గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Tags

Read MoreRead Less
Next Story