మున్సిపాలిటీల్లో లంచాలు మాట వినిపించకూడదు: కేటీఆర్
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు.. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం అయ్యారు. నూతన పురపాలక చట్టంపై అవగాహన కల్పించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై కీలక సూచనలు చేశారు. దేవరకొండ పట్టణంలో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. 48 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నెట్వర్క్, రోడ్లు, పార్క్, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 10వ వార్డులోని హనుమాన్నగర్, లక్ష్మీకాలనీ, అయ్యప్పనగర్, జంగాల కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
దేవరకొండలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. దేవరకొండలో కోతుల, పందుల బెడదను పరిష్కరిస్తామన్నారు. ఖాళీ ప్రదేశాల్లో ముళ్లపొదలు, చెట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారంప్రతి మున్సిపాలిటీలో 10 శాతం నిధులు హరితహారం కోసం ఖర్చుచేయాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బ్రతకాలని.. లేకపోతే కఠినచర్యలు తప్పవన్నారు. మున్సిపాలిటీల్లో ఇకపై లంచాల మాట వినపడొద్దని హెచ్చరించారు.
అనంతరం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పట్టణ ప్రగతి సమావేశానికి హాజరయ్యారు మంత్రి కేటీఆర్. చెత్తను కాల్వడం చాలా హానికరమని, ఇకపై ఇలాంటివి నడవవని హెచ్చరించారు. ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉండకపోతే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వార్డు పారిశుధ్య ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ ఆటోలకు అందించాలని కోరారు కేటీఆర్. ప్రతి పట్టణంలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి రాష్ట్రంలో బహిరంగ మలమూత్ర విసర్జన ఉండకుండా చేస్తామన్నారు. అత్యుత్తమ పౌరసేవలే లక్ష్యంగా నూతన మున్సిపల్ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com