అమరావతి కోసం న్యాయపోరాటాన్ని కూడా కొనసాగిస్తున్న రైతులు

అమరావతి కోసం న్యాయపోరాటాన్ని కూడా కొనసాగిస్తున్న రైతులు

రాజధాని అమరావతి కోసం 71 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులు..న్యాయపోరాటాన్ని కూడా కొనసాగిస్తున్నారు. శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా ప్రభుత్వం హైకోర్టు కార్యాలయాల్ని కర్నూలుకు తరలించడంపై కోర్టును ఆశ్రయించారు రాజధాని ప్రాంత రైతులు. ఇక రాజధాని విషయంలో వేసిన కమిటీలకు చట్ట బద్ధత లేదని కొందరు.. CRDA పరిధిలో పేదలకు భూపంపిణీపై మరికొందరు పిటిషన్లు వేశారు.

హైకోర్టుకు సంబంధించిన కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. స్థలం లేకనే కార్యాలయాలను తరలించాల్సి వస్తోందని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఉమ్మడి హైకోర్టుని అఫ్జల్ గంజ్ ప్రధాన భవనం నుంచి గచ్చిబౌలికి షిఫ్టింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని గతంలో కోర్టు తోసిపుచ్చిన అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. 2015లో ఉమ్మడి హైకోర్టు తీర్పు చెబుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసనసభకు గానీ అలా అడిగే హక్కు లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తరలింపుపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మార్చ్ 17కు వాయిదా వేసిది.

CRDA బిల్లు రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ రాజధాని రైతులు వేసిన పిటిషన్లపైనా విచారణ జరిగింది..సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులు, కమిటీలను ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరవు న్యాయవాది అశోక్ బాన్ హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. కమిటీల నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 30కివాయిదా వేసింది.

CRDA పరిధిలో పేదలకు భూ కేటాయింపుపై జారీ చేసిన 107 జీవోనూ సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లపైనా హైకోర్టు విచారణ జరిపింది. రాజధాని పరిధిలో లేని వారికి అక్కడ భూములు ఇవ్వడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గురువారం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు. .హైకోర్టు తరలింపుపై దాఖలైన పిటిషన్లను ఒక బ్యాచ్‌గా, రాజధాని విషయంలో ఏర్పాటు చేసిన కమిటీలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లపై మరో బ్యాచ్‌గా వాదనలు వినాలని త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story